



Best Web Hosting Provider In India 2024

భద్రాద్రి గిరిజన మహిళల ‘మిల్లెట్ మ్యాజిక్’ను మెచ్చుకున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గిరిజన మహిళలను మెచ్చుకున్నారు. వీళ్లు ఇంతకుముందు శానిటరీ నాప్కిన్లు తయారు చేసేవాళ్లు. ఇప్పుడు “భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్” అనే బ్రాండ్తో చిరుధాన్యాల బిస్కెట్లు తయారు చేసి విజయం సాధించారు.
గిరిజన మహిళల సత్తాను, వాళ్ల వ్యాపార ఆలోచనలను గుర్తించిన ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గిరిజన మహిళలను అభినందించారు.ఇంతకుముందు శానిటరీ నాప్కిన్లు తయారు చేసే ఆ మహిళలు ఇప్పుడు “భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్” బ్రాండ్తో చిరుధాన్యాలతో బిస్కెట్లు తయారు చేసి సక్సెస్ అయ్యారు.
భద్రాచలం ఐటీడీఏ (సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ) మద్దతుతో శ్రీ భద్రాద్రి శ్రీ రామ జాయింట్ లయబిలిటీ గ్రూప్ అనే స్వయం సహాయక బృందం (ఇది ఎంఎస్ఎంఈగా రిజిస్టర్ అయింది) ఆర్థికంగా నిలదొక్కుకుంది. దీంతో వాళ్లకు మంచి ఉపాధి దొరకడమే కాకుండా, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను కూడా ప్రోత్సహిస్తున్నారు.
ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐఏఎస్ బి. రాహుల్ ఈ ప్రయాణం ఎలా మొదలైందో వివరించారు. “గతంలో, ఈ బృందం మా గిరిజన విద్యా సంస్థలకు, విద్యార్థులకు శానిటరీ నాప్కిన్లు తయారు చేసి సరఫరా చేసేది. మూడు నెలల్లో 50,000 నాప్కిన్లు సరఫరా చేసి, సంవత్సరానికి 20 లక్షల రూపాయల టర్నోవర్ సంపాదించేవాళ్లు” అని ఆయన చెప్పారు. “కానీ వాళ్లు కేవలం మూడు నెలలు మాత్రమే పనిలో ఉండేవాళ్లు. మిగతా సమయం ఖాళీగానే ఉండేవాళ్లు. ఆ ఖాళీ సమయాన్ని కూడా ఉపయోగించుకోవాలనుకొని, ట్రైనింగ్ అవకాశాల కోసం మమ్మల్ని కలిశారు.” అని వివరించారు.
వాళ్ల అభ్యర్థన మేరకు ఐటీడీఏ ఆ బృందాన్ని హైదరాబాద్కు రెండు రోజుల చిరుధాన్యాల కుకీల తయారీ శిక్షణ కార్యక్రమానికి పంపింది. “వాళ్లు జొన్న, కొర్రలు, రాగి కుకీలు చేయడం నేర్చుకున్నారు” అని రాహుల్ చెప్పారు. “మొదట్లో, వాళ్లు ఐటీడీఏ ప్రాంగణంలోనే తమ ఉత్పత్తులను మార్కెట్ చేశారు. తర్వాత, మా సహాయంతో శ్రీరాముడి ఆలయం దగ్గర, గిరిజన మ్యూజియం దగ్గర స్టాళ్లను ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్రయత్నం త్వరగా ఊపందుకుంది. ట్రైబ్ఫెడ్ మద్దతుతో వాళ్ల ఉత్పత్తులను రాష్ట్రపతి భవన్లో ప్రదర్శించడానికి సహాయం చేశాం” అని ఆయన తెలిపారు.
“రాష్ట్రపతి వాళ్ల స్టాల్ను సందర్శించి బిస్కెట్ల నాణ్యతను మెచ్చుకున్నారు. అప్పటి నుంచి, వాళ్లకి చాలా ఆర్డర్లు వస్తున్నాయి. వాటిని వాళ్లు ఒకటి రెండు రోజుల్లోనే పూర్తి చేస్తున్నారు.” అని వివరించారు.
ఎక్కడ కొనుగోలు చేయొచ్చు
చిరుధాన్యాల స్నాక్స్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరిస్తూ “ఈ రోజుల్లో ప్రజలు ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. పిల్లలకు చిరుధాన్యాల కుకీలు ఇవ్వడం చాలా మంచిది. ఈ బృందం రాగి, ఇతర ముడి పదార్థాలను నేరుగా రైతుల నుండి కొనుగోలు చేస్తుంది. కాబట్టి కల్తీకి ఆస్కారం లేదు. ఇది వాళ్ల విజయానికి ప్రధాన కారణాలలో ఒకటి. ఇప్పుడు ఈ ఉత్పత్తులు “భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్” బ్రాండ్ పేరుతో అమ్ముడవుతున్నాయి. కస్టమర్లు స్థానిక స్టాళ్లలో, ఐటీడీఏ ప్రచారం చేసే ఇతర కార్యక్రమాలలో వీటిని కొనుగోలు చేయవచ్చు..’ అని వివరించారు.
ఆ బృందంలోని మహిళల్లో ఒకరైన లలిత కూడా తన అనుభవాన్ని పంచుకున్నారు. “ఐటీడీఏ సహాయంతో మేము గత సంవత్సరం నుంచి చిరుధాన్యాల బిస్కెట్లు తయారు చేస్తున్నాం” అని ఆమె చెప్పారు. “హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో రెండు రోజుల శిక్షణ పొందాం. ఇప్పుడు మేం రాగి, కొర్రలు, జొన్న బిస్కెట్లు తయారు చేస్తున్నాం” అని తెలిపారు.
ముడి పదార్థాల స్వచ్ఛత గురించి మాట్లాడుతూ “మేము చిరుధాన్యాలను నేరుగా రైతుల నుండి కొనుగోలు చేస్తాం. కాబట్టి ఎటువంటి కల్తీ ఉండదు. మా బిస్కెట్లలో వాడే పదార్థాలు వెన్న, నెయ్యి, బెల్లం. మేం ఎటువంటి రసాయనాలు ఉపయోగించం. అవి పూర్తిగా ఆర్గానిక్. పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ సరిపోయే బిస్కెట్లు తయారు చేయడమే మా లక్ష్యం.” అని వివరించారు.
ప్రజల స్పందన చాలా బాగుందని లలిత చెప్పారు. “బిస్కెట్లు తిన్న ప్రతి ఒక్కరూ బాగున్నాయని చెప్పారు” అని ఆమె అన్నారు. “రుచి చూసిన తర్వాత చాలా ఆర్డర్లు వస్తాయి. దేవాలయాలు, శిల్పారామం, ఇంకా ఢిల్లీలో కూడా స్టాళ్లు పెట్టుకోవచ్చని ఐటీడీఏ మాకు సమాచారం ఇస్తుంది. కొరియర్ ద్వారా కూడా ఆన్లైన్ ఆర్డర్లు పూర్తి చేస్తున్నాం” అని వివరించారు.
ప్రధాని మోదీ తన ‘మన్ కీ బాత్’లో తమ గురించి చెప్పడంపై ఆమె స్పందిస్తూ, “ప్రధాన మంత్రి మా గురించి మాట్లాడారు. నిజంగా చాలా గర్వంగా ఉంది. ఇక్కడి అధికారులు మాకు అన్ని విధాలా సహాయం చేశారు. అందుకే మేం ప్రధాని మోదీ వరకు చేరుకోగలిగాం. ముఖ్యంగా ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రతి అడుగులోనూ మాకు సహాయం చేశారు. ఇలాగే మరింత మంది మమ్మల్ని ప్రోత్సహిస్తే, మేము ఇంకా గొప్ప స్థాయికి చేరుకుంటాం” అని అన్నారు. (ANI)
టాపిక్