Best Web Hosting Provider In India 2024

AP Ration Cards : ఏపీలో కూటమి ప్రభుత్వం రేషన్ కార్డుల మార్పు చేర్పులు, కొత్త కార్డుల జారీపై దృష్టిపెట్టింది. తాజాగా ప్రభుత్వం పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయాలని నిర్ణయించింది. వైసీపీ ప్రభుత్వం హయాంలో రేషన్ కార్డులను పార్టీ రంగుల్లో వైఎస్ఆర్, వైఎస్ జగన్ ఫొటోలతో జారీ చేశారు. వీటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త రేషన్ డిజైన్లపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.
మళ్లీ చంద్రన్న కానుకలు
ఏపీ సర్కార్ రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే గత టీడీపీ ప్రభుత్వంలో అందించిన నిత్యావసరాలను తిరిగి అందిస్తామని తెలిపిన ప్రభుత్వం..తాజాగా మరో ప్రకటన చేసింది. 2014-2019 మధ్య పండుగల సందర్భంగా ఇచ్చిన కానుకలను తిరిగి అందించాలని నిర్ణయించింది. సంక్రాంతి, క్రిస్మస్ కానుకలు, రంజాన్ తోఫా పథకాలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. రేషన్ దుకాణాల్లో సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ తోఫాలను ఉచితంగా అందించేందుకు కసరత్తు చేస్తుంది. ఈ పథకానికి ఏటా రూ.538 కోట్లు చొప్పున ఐదేళ్లకు రూ.2,690 కోట్ల భారం పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది.
రేషన్ కార్డుదారులకు నిత్యావసరాల పంపిణీ
గత టీడీపీ హయాంలో చంద్రన్న కానుకల్లో కిలో గోధుమ పిండి, అర కిలో బెల్లం, అర కిలో శనగపప్పు, అర కిలో కందిపప్పు, అర లీటరు పామాయిల్, 100 మి.లీ నెయ్యి అందించేవారు. రంజాన్ తోఫాలో 5 కిలోల గోధుమపిండి, కిలో వర్మిసెల్లి, 2 కిలోల చక్కెర, 100 మిల్లీ గ్రాముల నెయ్యి ఉచితంగా అందించేవారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక చంద్రన్న కానుకలను నిలిపివేసింది. ఏపీలో ప్రస్తుతం 1,48,43,671 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రస్తుతం రేషన్ కార్డుదారులకు బియ్యం, పంచదార, అప్పుడప్పుడూ గోధుమ పిండి, కందిపప్పు ఇస్తున్నారు. ఇకపై ప్రతి నెలా ఉచిత బియ్యంతో పాటు చక్కెర, గోధుమపిండి, జొన్నలు, సజ్జలు, కందిపప్పు, తృణధాన్యాలు అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అలాగే చంద్రన్న కానుకలను తిరిగి అందించాలన్నారు.
సంబంధిత కథనం
టాపిక్