12 జ్యోతిర్లింగాల దర్శనం పూర్తి చేసుకున్న మంచు విష్ణు.. కన్నప్ప రిలీజ్‌కు ముందు శ్రీశైలంలో మంచు హీరో

Best Web Hosting Provider In India 2024

12 జ్యోతిర్లింగాల దర్శనం పూర్తి చేసుకున్న మంచు విష్ణు.. కన్నప్ప రిలీజ్‌కు ముందు శ్రీశైలంలో మంచు హీరో

Hari Prasad S HT Telugu

మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన కన్నప్ప మూవీ శుక్రవారం (జూన్ 27) రిలీజ్ కానుంది. దానికి రెండు రోజుల ముందు అతడు 12 జ్యోతిర్లింగాల దర్శనం పూర్తి చేసుకోవడం విశేషం. చివరిగా అతడు శ్రీశైల మల్లికార్జునుడిని దర్శించుకున్నాడు.

12 జ్యోతిర్లింగాల దర్శనం పూర్తి చేసుకున్న మంచు విష్ణు.. కన్నప్ప రిలీజ్‌కు ముందు శ్రీశైలంలో మంచు హీరో

మంచు విష్ణు టెంపుల్ రన్ ముగిసింది. తన కన్నప్ప మూవీ కోసం అతడు కొన్నాళ్లుగా దేశంలోని 12 జ్యోతిర్లింగాల దర్శనం కోసం తిరుగుతున్న విషయం తెలిసిందే. మొత్తానికి బుధవారం (జూన్ 25) శ్రీశైలంలో ఈ పర్యటన ముగిసింది. ఈ విషయాన్ని అతడు తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు. కన్నప్ప మూవీ శుక్రవారం (జూన్ 27) రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

ముగిసిన ఆధ్యాత్మిక ప్రయాణం..

మంచు విష్ణు తన జ్యోతిర్లింగాల దర్శనాన్ని పూర్తి చేసుకున్నాడు. బుధవారం (జూన్ 25) అతడు శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్నాడు. ఆ తర్వాత తన ఎక్స్ అకౌంట్లో దీనికి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ.. తన పర్యటన ముగిసినట్లు వెల్లడించాడు.

“ఒక ఆధ్యాత్మిక ప్రయాణం.. పన్నెండు జ్యోతిర్లింగాలు.. ఇది నిజంగా ఓ అద్భుత అనుభూతి! తాజాగా, శివుడి పన్నెండు పవిత్ర జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం పూర్తయింది. ఈ దర్శనంతో, నా పన్నెండు జ్యోతిర్లింగాల ప్రయాణం దివ్యంగా ముగిసింది. నా మనసు నిండిపోయింది. నా ఆత్మకు ఆశీర్వాదం లభించింది. ప్రస్తుతం జీవితం సానుకూలత, కృతజ్ఞత, శాంతితో నిండి ఉంది.

ఆధ్యాత్మికంగా ఒక గొప్ప ఘట్టాన్ని పూర్తి చేసుకున్నాను. ఇప్పుడు నా తర్వాతి అధ్యాయం ‘కన్నప్ప’పై దృష్టి సారిస్తున్నాను. ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. నా మనసుకు దగ్గరైన సినిమా ఇది. ఈరోజు నాలో ఉన్న స్ఫూర్తిని ప్రతిబింబించే కథ. హర్ హర్ మహదేవ్” అంటూ విష్ణు తన పోస్ట్ ముగించాడు.

కన్నప్ప మూవీ గురించి..

మంచు విష్ణు లీడ్ రోల్లో నటించిన కన్నప్ప మూవీ శుక్రవారం (జూన్ 27) రిలీజ్ కాబోతోంది. అతని తండ్రి మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమాను ముకేశ్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ అతిథి పాత్రలు పోషించారు. వీళ్లే కాకుండా మోహన్ బాబు, శరత్ కుమార్, మధూ, బ్రహ్మానందం, బ్రహ్మాజీలాంటి వాళ్లు కూడా నటించారు.

శివుడి భక్తుడైన కన్నప్పపై పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకూ దీనిపై పెద్ద బజ్ మాత్రం కనిపించడం లేదు. మూవీ టీమ్ బాగానే ప్రమోట్ చేస్తున్నా.. అభిమానుల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024