కొడుకు ప్రాణం కోసం దొంగతనం: జైల్లో ఉండగానే బిడ్డ మరణం!

Best Web Hosting Provider In India 2024


కొడుకు ప్రాణం కోసం దొంగతనం: జైల్లో ఉండగానే బిడ్డ మరణం!

HT Telugu Desk HT Telugu

“నాన్నా, నువ్వు బయటకి వచ్చాక, నా గురించి ఎక్కువగా ఆలోచించకు. నన్ను చూడాలనిపిస్తే, ఆ సరస్సు దగ్గరికి వెళ్లు. నేను ఎప్పుడూ అక్కడే ఉంటాను.” జియాయు తన తండ్రికి చెప్పిన ఈ చివరి మాటలు ఆ తండ్రి గుండెను చీల్చేశాయి.

నా గురించి ఎక్కువగా ఆలోచించకు. నన్ను చూడాలనిపిస్తే, ఆ సరస్సు దగ్గరికి వెళ్లు. నేను ఎప్పుడూ అక్కడే ఉంటాను

తన కొడుకును కాపాడుకోవడానికి దొంగతనం చేసిన ఓ వ్యక్తి జైలు పాలయ్యాడు. కానీ జైల్లో ఉండగానే తన బిడ్డ చివరి శ్వాస విడిచాడు. ఈ ఘటన చైనాలో వెలుగు చూసింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, 29 ఏళ్ల యూ హైబో అనే తండ్రి తన కొడుకుకు సోకిన ల్యుకేమియా చికిత్స కోసం రోడ్డు పక్కన ఉండే ట్రాన్స్‌ఫార్మర్‌లను దొంగిలించి జైలు పాలయ్యాడు. కానీ అతను జైలులో ఉండగానే అతని నాలుగేళ్ల కుమారుడు జియాయు ప్రాణాలు కోల్పోయాడు.

హైబో జైలులో ఉన్న ప్రాంతానికి అతి దగ్గరలోని ఒక సరస్సులో అతని కొడుకు జియాయు అస్థికలను నిమజ్జనం చేశారు.

నిస్సహాయ తండ్రి గుండె ఘోష:

జిలిన్ ప్రావిన్స్‌లోని ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన యూ హైబోది పేదరికం నిండిన బాల్యం. టీనేజ్‌లోనే బడి మానేసి, బతుకు తెరువు కోసం చెఫ్‌గా, వెల్డర్‌గా పనిచేశాడు. ఇరవై ఏళ్లు కూడా నిండకముందే తన ప్రేయసిని పెళ్లి చేసుకున్నాడు. కొడుకు పుడితే జియాయు అని పేరు పెట్టాడు.

అప్పుడు హైబో కారుల ఫ్యాక్టరీలో పనిచేస్తూ నెలకు కేవలం 2,000 యువాన్లు (దాదాపు 23,000) సంపాదించేవాడు. భార్య గృహిణి. అంతా బాగానే ఉంది అనుకుంటున్న తరుణంలో జియాయుకు మూడేళ్ల వయసు ఉండగా ఊహించని పిడుగు పడింది. జియాయుకు రక్తాన్ని, ఎముక మజ్జను తినేసే ప్రమాదకరమైన క్యాన్సర్ ల్యుకేమియా వచ్చిందని వైద్యులు తేల్చారు.

“నమ్మలేకపోయాను. నా కొడుకు ప్రాణం నిలబెట్టుకోవడానికి నాకున్నదంతా వదులుకోవడానికి సిద్ధమయ్యాను” అని అప్పుడు తన గుండె ఘోషను ‘జియుపై న్యూస్’కు చెప్పుకొచ్చాడు హైబో.

కన్నపేగు బంధం కదా. నిస్సహాయంగా నిలబడలేక, ఆ తండ్రి అనేక పనులు చేశాడు. ఉన్న చిన్న ఇంటిని అమ్మేసుకున్నాడు. చేతులు చాచి అప్పులు కూడా చేశాడు. ఎలాగైనా తన జియాయును బతికించుకోవాలని పరితపించాడు.

కానీ, విధి మరో పరీక్ష పెట్టింది. కోవిడ్ మహమ్మారి దేశాన్ని చుట్టుముట్టింది. హైబో సంపాదన పూర్తిగా ఆగిపోయింది. ఆకలి, అనారోగ్యం వెంటాడాయి. 2021 ఏప్రిల్‌లో వైద్యులు జియాయుకు మరింత మెరుగైన చికిత్స అవసరమని, దానికి పదివేల యువాన్లు (సుమారు 1,15,000) ఖర్చవుతుందని చెప్పారు. అప్పటికే అతని దగ్గర ఒక్క పైసా కూడా లేదు.

కొడుకు కోసం దొంగగా మారిన తండ్రి:

డబ్బు ఎక్కడి నుంచి తేవాలో, ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. అదే నిస్సహాయతలో ఉన్న హైబోకి, అతని స్నేహితుడు ఒక ఆలోచన చెప్పాడు. “రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి రాగిని తీసి అమ్మితే డబ్బు వస్తుంది” అని సలహా ఇచ్చాడు. కొడుకు ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు అనుకున్నాడు ఆ తండ్రి. నిధులు సేకరించాలనే తపనతో, అతను దాదాపు 20కి పైగా ట్రాన్స్‌ఫార్మర్లను దొంగిలించి, వాటిలోని రాగిని సుమారు 30,000 యువాన్లకు (దాదాపు 3,45,000) అమ్మాడు.

“అది చట్టవిరుద్ధమని నిజంగా నాకు తెలియదు. ఆ క్షణంలో నా కొడుకు ప్రాణం తప్ప నాకు ఇంకేమీ కనిపించలేదు. నేను చాలా నిస్సహాయంగా ఉన్నాను” అని హైబో కన్నీళ్లతో చెప్పాడు.

దొంగతనం చేసిన నేరానికి హైబోను అరెస్టు చేశారు. అతనికి నాలుగు సంవత్సరాల జైలు శిక్ష పడింది. హైబో జైలు పాలవ్వగా, అతని భార్య ఒంటరిగా చాలా పనులు చేస్తూ, అనారోగ్యంతో ఉన్న కొడుకును చూసుకోవాల్సి వచ్చింది.

జైల్లో తండ్రి, ఆకాశంలో బిడ్డ:

2023 ప్రారంభంలో హైబో ఇంకా జైలులోనే తన శిక్షను అనుభవిస్తున్నాడు. ఆ గుండె పగిలే వార్త అతనికి చేరింది… అతని కొడుకు జియాయు కన్నుమూశాడు. కొడుకు చనిపోవడానికి సరిగ్గా ఒక నెల ముందు, హైబోను చివరిసారిగా ఆసుపత్రిలో జియాయును కలవడానికి అనుమతించారు. ఆ చివరి చూపు, చివరి మాటలు… ఆ తండ్రి జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలు.

“నాన్నా, నువ్వు బయటకి వచ్చాక, నా గురించి ఎక్కువగా ఆలోచించకు. నన్ను చూడాలనిపిస్తే, ఆ సరస్సు దగ్గరికి వెళ్లు. నేను ఎప్పుడూ అక్కడే ఉంటాను.” జియాయు తన తండ్రికి చెప్పిన ఈ చివరి మాటలు ఆ తండ్రి గుండెను చీల్చేశాయి.

ఆ చిన్నారి అమాయకత్వం, ప్రేమ కలిసిన ఆ మాటలు హైబో గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి. 2024 నవంబర్‌లో జైలు నుంచి విడుదలైన తర్వాత, హైబో ప్రతి రెండు వారాలకు ఒకసారి ఆ సరస్సును సందర్శిస్తున్నాడు. తన కొడుకు ఆత్మ అక్కడే ఉందని బలంగా నమ్ముతున్నాడు. ఇటీవల, ఫాదర్స్ డే నాడు, అతను సరస్సు వద్దకు జియాయుకు ఇష్టమైన పువ్వులు, కేకు, బొమ్మలను తీసుకుని వెళ్లి, ప్రేమగా నీటిలో వదిలాడు.

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link