Best Web Hosting Provider In India 2024

రాష్ట్రంలో ఏం జరుగుతుందో వారికీ వివరిస్తాం
ఢిల్లీ ధర్నా తరువాత పార్లమెంటులో గళం
రాష్ట్రంలో దారుణ స్థితిని అందరికీ వివరిస్తాం
కూటమి ప్రభుత్వ దమనకాండను దేశం దృష్టికి తీసుకెళ్తాం
రాష్ట్రంలో ఘటనలతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం
వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలి.. ఈ విషయాన్ని పార్లమెంటులో నినదించాలి
చంద్రబాబుకు గట్టి హెచ్చరికలు పంపాలి, లేకపోతే ఈ దారుణాలకు అడ్డుకట్ట పడదు
అసెంబ్లీ సమావేశాల్లోనూ నిరసన వ్యక్తం చేస్తాం, గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం
వైయస్ఆర్సీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్టీ అధినేత వైయస్ జగన్
తాడేపల్లి: ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగుతున్న దారుణ దమనకాండను యావత్ దేశం దృష్టికి తీసుకెళ్తామని, అందుకే ఢిల్లీలో నిర్వహించే ధర్నా కార్యక్రమానికి అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో గత 45 రోజులుగా ఏం జరుగుతుందో వారికి వివరిస్తామని, ఈ పోరాటానికి కలిసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకుపోతామన్నారు. ఈనెల 24న (బుధవారం) ఢిల్లీలో నిర్వహించే ధర్నా కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నాయకులంతా పాల్గొంటారని చెప్పారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో పార్టీ అధినేత వైయస్ జగన్ అధ్యక్షతన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీలను ఉద్దేశించి వైయస్ జగన్ మాట్లాడారు.
పార్లమెంటులో గళం ఎత్తాలి
ఢిల్లీలో ధర్నా తర్వాత, పార్టీ ఎంపీలు తమ సభలకు హాజరవ్వాలి. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, దాడులు, ఆస్తుల విధ్వంసంపై గట్టిగా మాట్లాడాలి. ఇక్కడ కూటమి ప్రభుత్వం కక్షతో చేస్తున్న దురాగతాలను పార్టీ ఎంపీలంతా.. తమ సభల్లో సభ్యులందరి దృష్టికి తీసుకెళ్లాలి.
ధర్నా కార్యక్రమంపై నిమగ్నం కావాలి..
ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రి అపాయింట్మెంట్లు కోరాము. అవి రాగానే.. వారికీ ఇక్కడి పరిస్థితిని వివరిస్తాం. ఢిల్లీలో ధర్నా, నిరసన కార్యక్రమానికి సంబంధించి ఒక్కో ఎంపీకి, ఒక్కో బాధ్యత. వారంతా వెంటనే ఢిల్లీ వెళ్లి, ధర్నా కార్యక్రమంపై నిమగ్నం కావాలి.
రాష్ట్రపతి పాలన విధించాలి
ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు ప్రజల్లో మరింత ఆగ్రహానికి దారి తీస్తున్నాయి. అందుకే మనం రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలి.అలా చంద్రబాబుకు గట్టిగా హెచ్చరికలు పంపాలి. పోరాటం చేయకపోతే దారుణాలకు అడ్డుకట్ట పడదు.
అసెంబ్లీలోనూ నిలదీస్తాం
అసెంబ్లీ సమావేశాల్లోనూ నిరసన వ్యక్తం చేస్తాం. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే సమయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. రాష్ట్రంలో దారుణాలు, అరాచకాలు, ఇక్కడ జరుగుతున్న ఘటనలపై అందరూ గళమెత్తాల్సిన అవసరం ఉంది.
ప్రజాస్వామ్య మనుగడకే..
రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఘటనలు ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదు. అవి ప్రజాస్వామ్య మనుగడకు పెద్ద దెబ్బగా భావించాలి. అందుకే అన్ని పార్టీలకూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరించాలి. ఎందుకంటే, రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్న పరిస్థితులు ప్రజాస్వామ్యానికి మంచివి కావు.
హత్య ఒక పరాకాష్ట
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందింది. వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల మీద దారుణంగా దాడులు జరగుతున్నాయి. వినుకొండ హత్య ఇందులో పరాకాష్ట. ఆ హత్య వీడియో దృశ్యాలు.. రాష్ట్రంలో దారుణ శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ప్రజలందరూ చూస్తుండగా, నడిరోడ్డు మీద కత్తితో నరికి చంపిన తీరు అత్యంత అత్యంత అమానుషం. తమ రాజకీయ ప్రత్యర్థులకు, వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు ఒక మెసేజ్ పంపడానికి చేసిన ప్రయత్నం ఇది.
వక్రీకరణకు యత్నం..
వినుకొండలో దారుణహత్యకు గురైన పార్టీ కార్యకర్త రషీద్ ఒక వైన్షాపులో సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. ఆ రాజకీయ హత్య ఘటనను వక్రీకరించడానికి ఎల్లోమీడియా సహాయంతో ప్రభుత్వం నానా ప్రయత్నాలు చేస్తోంది. ఏదో బైక్ కాల్చిన ఘటనకు, ఇప్పుడు జరిగిన దారుణహత్యకు ముడి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఆ కాలిన బైక్.. వైయస్సార్సీపీ వాళ్లది, దీనికి సంబంధించి కేసు కూడా నమోదైంది. దాన్ని కూడా ట్విస్ట్ చేసి, నానా తప్పుడు రాతలు రాస్తున్నారు. అసలు, తమ కొడుకు ఏం తప్పు చేశాడని, రషీద్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సీఎంగా వైయస్ జగన్ ఉంటే.. అంతా మంచి జరుగుతుందని నమ్మడం మా తప్పు అవుతుందా? అని వాళ్లు ప్రశ్నిస్తున్నారు.
ఎస్పీని మార్చి..
పల్నాడు జిల్లాకు కొత్త ఎస్పీ వచ్చిన రెండు మూడు రోజుల్లోనే హత్యతో సహా, పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. జిల్లాకు అంతకు ముందు ఎస్పీగా మల్లికాగార్గ్ ఉన్నారు. ఆమె సమర్థురాలు. అందుకే ఆమెను ఉద్దేశపూర్వకంగా బదిలీ చేశారు. తమకు అనుకూలంగా ఉండే ఎస్పీని నియమించుకుని, ఈ దారుణాలు చేస్తున్నారు.
ఎన్నెన్ని దారుణ ఘటనలు..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరవాత, ఈ 45 రోజుల్లో 36 మంది రాజకీయ హత్యలకు గురయ్యారు. 300కు పైగా హత్యాయత్నాలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ వారి వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 560 చోట్ల ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. ఇళ్లల్లోకి చొరపడుతున్నారు. ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. షాపులను కాల్చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులకు చెందిన చీనీ చెట్లు నరికేస్తున్నారు. మొత్తం 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు. ఇవి కాక 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయి. హత్యలు, దాడులు చేయడానికి టీడీపీ వాళ్లకి లైసెన్స్ ఇచ్చినట్టుగా ఉంది.
హంతకుడితో వారి సంబంధాలు..
రషీద్ హంతకుడైన జిలానీ, లోకేష్ పుట్టినరోజున, స్థానిక ఎమ్మెల్యే భార్యకు స్వయంగా కేక్ తినిపించిన ఫొటోలను.. రషీద్ తల్లిదండ్రులు చూపారు. ఇంకాస్థానిక ఎమ్మెల్యేతో హంతకుడి ఫొటోలను కూడా వారు చూపించారు.
ఎంపీపైనా యథేచ్ఛ దాడి..
మరోవైపు తన సొంత పార్లమెంటు నియోజకవర్గంలో, తన తండ్రి ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలోనే ఎంపీ మిథున్రెడ్డిపై దాడులు చేశారు. కావాలనే అక్కడ టీడీపీ మనుషులు ఉండేలా, పోలీసులతో ప్లాన్ చేసి మరీ దాడులు చేశారు. మాజీ ఎంపీ రెడ్డప్ప ఒక న్యాయవాది. ఎంపీ మిధున్రెడ్డి పుంగనూరులో ఆయన ఇంటికి వెళ్తే, రాళ్లతో దాడి చేసి, వాహనాలు కూడా ధ్వంసం చేశారు. మాజీ ఎంపీ రెడ్డప్పకు చెందిన వాహనాన్ని దగ్ధం చేశారు. అన్ని తప్పులు చేసిన వారే, తిరిగి మన పార్టీ వాళ్ల మీద కేసులు పెడుతున్నారు.
ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుందా?
రాష్ట్రంలో 15 సంవత్సరాలుగా వైయస్సార్సీపీ ప్రస్థానంలో ఉంది. చంద్రబాబు ఆశించినట్టుగా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆయన అణగదొక్కలేరు. ఎవరు అధికారంలో ఉన్నా ఇలాంటి దాడులు మంచివి కావు. అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలో లేని పార్టీ మీద దాడులు చేయడం అనేది ధర్మమా? ఇక ప్రజాస్వామ్యానికి విలువ ఏముంటుంది?. ప్రభుత్వాలు చేసే మంచి పనుల ఆధారంగా ఆ పార్టీ పరిస్థితులు ఉంటాయి.
మనది పారదర్శక పాలన..
గత ఎన్నికల్లో మనం 86 శాతం సీట్లను గెలిచాం. అయినా ఇలాంటి ఘటనలు జరగలేదు. వైయస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఓటు వేయని వారికి కూడా ఇంటింటికీ వెళ్లి పథకాలు ఇచ్చాం. దాడులను ఎప్పుడూ ప్రోత్సహించలేదు. ప్రజలందరినీ సమానంగా చూశాం, అందరికీ పారదర్శకంగా సేవలు అందించాం.
మరి ఈ ప్రభుత్వ ఉద్దేశం!
ప్రజలిచ్చిన వాగ్దానాల అమలు కాకపోవడంపై ఎవ్వరూ ప్రశ్నించకూడదన్నదే ఈ ప్రభుత్వ ఉద్దేశం. దీనిపై ఎవ్వరూ నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు చేయకూడదన్నదే ప్రభుత్వ ఆలోచన. అందుకే దగ్గరుండి వీటిని ప్రోత్సహిస్తున్నారు.
ఆ బాధ్యత మనపై..
పార్టీకి కార్యకర్తలు చాలా ముఖ్యం. ఎక్కడ కార్యకర్తలకు నష్టం జరిగినా వెంటనే స్పందించడం, వారిని కాపాడుకోవడం మన బాధ్యత. ఆయా కుటుంబాలకు తోడుగా నిలవాలి. కార్యకర్తలందరి తరఫున గట్టిగా నిలబడాలి. రాష్ట్రంలో వైయస్సార్సీపీకి లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉంది.