AP TDR Bonds Scam: ఏపీలో టీడీఆర్‌ బాండ్లలో భారీ కుంభకోణం.. నాలుగు పట్టణాల్లో వందల కోట్ల అక్రమాలు

Best Web Hosting Provider In India 2024

AP TDR Bonds Scam: ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లలో టీడీఆర్ బాండ్ల జారీలో భారీ స్కాం జరిగింది. పురపాలక శాఖ ప్రాథమిక విచారణలోనే వందల కోట్ల అక్రమాలు వెలుగు చూశాయి. పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తే కాని దాని లోతు ఎంతో తెలిసే అవకాశం కనిపించడం లేదు.

పట్టణ ప్రణాళికా విభాగంపై జరిపిన సమీక్షలో టిడిఆర్‌ బాండ్ల రూపంలో జరిగిన వందల కోట్ల దుర్వినియోగం వెలుగు చూసింది. టౌన్ ప్లానింగ్ లో రాష్ట్ర స్థాయి నుంచి కింది స్థాయి వరకూ ఉన్న అధికారులు, ఉద్యోగులు అనుసరిస్తున్న విధానాల్లో లోపాలను ప్రభుత్వం గుర్తించింది.

ఇకపై భవన నిర్మాణాల అనుమతులను పూర్తిగా ఆన్ లైన్ లోనే ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. ఎన్ని అంతస్తుల భవనమైనా ఆన్ లైన్‌లో మాత్రమే అనుమతి జారీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

విశాఖపట్నం, తణుకు, గుంటూరు, తిరుపతి నగరాల్లో టీడిఆర్ బాండ్ల జారీలో భారీగా అక్రమాలు జరిగినట్టు ప్రభుత్వం గుర్తించింది. తణుకులో జరిగిన అక్రమాలపై వేసిన అధికారుల కమిటీ ప్రాథమిక నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి అందచేసింది. నివేదికపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయనున్నట్టు మంత్రి నారాయణ ప్రకటించారు.

తణుకులో 29 బాండ్లు జారీ చేస్తే అవన్నీ అక్రమమేనని గుర్తించారు. ప్రభుత్వ బాండ్ల జారీలో భూమికి ఎకరాల ప్రకారం విలువ కట్టాల్సి ఉన్నా చదరపు గజాల ప్రకారం భూమి విలువ కట్టి అక్రమాలకు పాల్పడ్డారు. ఒక చదరపు గజానికి విలువ రు.4500 ఉండాల్సిన చోట రూ.22వేల రూపాయల మార్కెట్ విలువ లెక్క కట్టారు. పరిహారంగా 1:200 ఇవ్వడానికి బదులు 1:400 గా ఇచ్చారు.

భూసేకరణలో స్థలం కోల్పోతున్న భూమికి సమీపంలో ధర కంటే ఎక్కడో 1.4 కిమీ దూరంలో ఉన్న భూమి విలువను పరిగణనలోకి తీసుకుని బాండ్లను జారీ చేయడం పెద్ద స్కాం అని భావిస్తున్నారు. తణుకులో బాండ్ల జారీలో అక్రమాలకు పాల్పడ్డ ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. బాండ్ల జారీలో అక్రమాలు జరిగాయో అలాంటి చోట్ల ఇచ్చిన బాండ్లను నిలిపి వేసినట్లు చెప్పారు. కోర్టుకు వెళ్లిన 300 మంది బాండ్లను మార్చుకున్నారని…గత ప్రభుత్వంలో పాలన సున్నా అనేది బాండ్ల జారీ ద్వారా నిరూపితమైందన్నారు.

తిరుపతిలో రెండు టీడీఆర్ బాండ్ల లో చదరపు గజం విలువ 40,000 గా అధిక ధర చూపించారు. గుంటూరులో కూడా చదరపు గజం విలువ 9000 ఉండాల్సింది 20000 గా చూపించి బాండ్లు జారీ చేశారు. విశాఖపట్నంలో గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయకుండా నోటరీ అప్రూవల్ తో బాండ్లు జారీ చేసి అక్రమాలకు పాల్పడ్డారు.

రాష్ట్ర వ్యాప్తంగా వందల కోట్లను ఇలా బాండ్ల రూపంలో అధికారులు, అక్రమార్కులు కుమ్మక్కై దోచేశారు. రాజకీయ నాయకులు చెప్పినా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి నారాయణ సూచించారు.రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో బదిలీ చేస్తారనే భయంతో అధికారులు పని చేసినట్లు మంత్రి చెప్పారు.టీడీఆర్ బాండ్ల జారీ అక్రమాల్లో నాయకులదే మొదటి తప్పని, టీడీఆర్ బాండ్ల జారీలో అక్రమాలపై సీఎం తో చర్చించి అవసరమైతే మరికొన్ని కమిటీలు వేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ఇకపై ఎన్ని అంతస్తుల భవనం నిర్మాణం అయినా అనుమతులను ఆన్ లైన్ లోనే ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. 15 రోజుల్లోగా దరఖాస్తు పరిశీలించి ఎక్కడైనా సమస్య ఉంటే మరోసారి అర్జీదారునికి సమాచారం ఇవ్వాలని ప్రభుత్వానికి చెడ్డ పేరు అయినా మంచి పేరు అయినా తీసుకురావడం లో టౌన్ ప్లానింగ్ కీలకమైందన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి తనకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని మంత్రి చెప్పారు.

రాజధాని రైతులకు కౌలు చెల్లింపు…

రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు త్వరలో కౌలు చెల్లించనున్నట్టు మంత్రి చెప్పారు. త్వరలోనే రైతులకు కౌలు నిధులు విడుదల చేస్తామని మంత్రి చెప్పారు.ఏ రైతునూ ఇబ్బంది పెట్టమన్నారు. కేంద్రం ప్రకటించిన 15 వేల కోట్ల నిధులతో అమరావతి వేగంగా ముందుకెళ్తుందని మంత్రి నారాయణ చెప్పారు. జైకా వంటి సంస్థల ద్వారా నిధులు ఇస్తున్నారని అన్నారు. అమరావతిలో నిర్మాణాల పటిష్టత అధ్యయనానికి ఐఐటి చెన్నై,ఐఐటి హైదరాబాద్ సంస్థలను ఉపయోగించుకుంటున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. పనులు ఎలా మొదలు పెట్టాలని దానిపై సాంకేతిక కమిటీ వేసినట్లు చెప్పారు.

WhatsApp channel

టాపిక్

CrdaAndhra Pradesh NewsTelugu NewsLatest Telugu NewsBreaking Telugu NewsAmaravatiGovernment Of Andhra Pradesh
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024