





Best Web Hosting Provider In India 2024

భారత సైన్యానికి సంఘీభావంగా రేపు హైదరాబాద్ లో ర్యాలీ – సీఎం రేవంత్ రెడ్డి
ఆపరేషన్ సిందూర్, హైదరాబాద్ సివిల్ మాక్ డ్రిల్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. హైదరాబాద్ కీలక ప్రాంతమని నిఘా వర్గాలు కేంద్రం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భారత సైన్యానికి సంఘీభావంగా గురువారం సాయంత్రం ర్యాలీ నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు.
ఆపరేషన్ సిందూర్, హైదరాబాద్లో సివిల్ మాక్ డ్రిల్ పరిస్థితులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి సమీక్షించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను అప్రమత్తం చేయడానికి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో బుధవారం నిర్వహించిన మాక్ డ్రిల్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఆపరేషన్ సిందూర్
ఇలాంటి కీలక సమయాల్లో అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపైన ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు.
హైదరాబాద్ వ్యూహాత్మకం
“రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలి. అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.
రక్షణ రంగంలో వ్యూహాత్మకమైన హైదరాబాద్లో అవసరమైన అన్ని చోట్ల గట్టి భద్రతా ఏర్పాట్లు చేయాలి. ఆర్మీ, ఎయిర్ఫోర్స్ కార్యాలయాలు, రక్షణ రంగానికి చెందిన సంస్థలు, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలి”- సీఎం రేవంత్ రెడ్డి
నిఘా బృందాలు సమన్వయం
“తెలంగాణకు వచ్చిన విదేశీ పర్యాటకులకు తగిన రక్షణ కల్పించాలి. కేంద్ర నిఘా బృందాలతో రాష్ట్ర నిఘా బృందాలు సమన్వయం చేసుకుని పనిచేయాలి. కమాండ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకుని నిరంతరం పర్యవేక్షించాలి”-సీఎం రేవంత్ రెడ్డి
భారత సైన్యానికి సంఘీభావంగా ర్యాలీ
భారత సైన్యానికి సంఘీభావంగా గురువారం (8వ తేదీ) సాయంత్రం 6 గంటలకు సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు నిర్వహించే ర్యాలీ, అందుకు తీసుకోవలసిన చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులతో చర్చించారు. ర్యాలీలో యువత అధిక సంఖ్యలో పాల్గొనాలని భారత సైనిక బలగాలకు సంఘీభావంగా నిలవాలని పిలుపునిచ్చారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్ ను పరిశీలించిన సీఎం
తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. నగరంలో నిరంతరం నిఘా కొనసాగించడంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సాగుతున్న పర్యవేక్షణ తీరును అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేయడంతో పాటు నిరంతర పర్యవేక్షణ ఉండాలని చెప్పారు.
సంబంధిత కథనం
టాపిక్