




Best Web Hosting Provider In India 2024

ప్రతీ రహదారి పనికి డెడ్ లైన్… వర్షాకాలం రాకముందే రోడ్లు పూర్తి కావాలి – సీఎం చంద్రబాబు
దేశంలోనే నెంబర్ వన్గా రాష్ట్రంలో రహదారుల నిర్మాణం జరగాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రతీ రహదారి పనులకు డెడ్లైన్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. వర్షాకాలం రాకముందే రోడ్లు పూర్తి కావాలన్నారు.
రాష్ట్రంలో రహదారులను అత్యుత్తమ నాణ్యత-నిర్వహణ కలిగి ఉండేలా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తలపెట్టిన అన్ని రహదారుల పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.
ఆలోపు పూర్తి చేయాలి – సీఎం చంద్రబాబు
ప్రతీ రహదారి పనులకు డెడ్లైన్ నిర్దేశించి, అనుకున్న సమయానికల్లా కార్యరూపం దాల్చేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వర్షాకాల రాకముందే రోడ్ల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని చెప్పారు. 8,744 కి.మీ వరకు రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర, జాతీయ రహదారులు జాతీయ స్థాయిలోనే నెంబర్వన్గా ఉండాలని సూచించారు. మరోవైపు, రాష్ట్రంలో పూర్తిగా పాడైన 2,683 కి.మీ. రహదారులను కూడా అభివృద్ధి చేయాలని సూచించారు.
గురువారం సచివాలయంలో ఆర్ అండ్ బీ శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి… పలు అంశాలపై అధికారులకు మార్గదర్శకం చేశారు. ఆర్ అండ్ బీలో ఉన్న 304 ఏఈ పోస్టుల ఖాళీల్లో గ్రామ, వార్డు సచివాలయంలో పనిచేస్తున్న సివిల్ ఇంజినీరింగ్ ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలని సూచించారు.
97 శాతం మరమ్మతులు పూర్తి..
రాష్ట్రంలో రూ.860 కోట్లతో 20,060 కి.మీ. పొడవునా గుంతలు లేకుండా చేపట్టిన మరమ్మతుల పనులు 97 శాతం పూర్తయ్యాయని సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. మిగిలిన పనులను ఈ నెలాఖరుకు పూర్తి చేస్తామని చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్హెచ్ఏఐ, మార్త్కి సంబంధించి రూ.78,295 కోట్లతో 3,510 కి.మీ. పొడవైన.. 146 పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. 2024-25లో ఎన్హెచ్ఏఐ, మార్త్కి సంబంధించి రూ.11,682 కోట్లతో 546 కి.మీ. పొడవైన.. 22 పనులు పూర్తి చేశామని చెప్పారు. 2025-26లో ఎన్హెచ్ఏఐ, మార్త్, ఆర్ అండ్ బీకి సంబంధించి రూ.47,788 కోట్లతో 1,186 కి.మీ. పొడవైన… 46 పనులు పూర్తి చేస్తామని వివరించారు.
వాట్సప్ ద్వారా రేషన్ దరఖాస్తుల స్వీకరణ:
రేషన్ సరుకుల పంపిణీ, దీపం-2 పథకం అమలు, ధాన్యం సేకరణలో ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పౌరసరఫరాల శాఖపై సమీక్షించిన ఆయన….. అవకతవకలు జరగకుండా మొత్తం వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని అధికారులను సూచించారు.
ప్రజల్లో పూర్తి సంతృప్తి చెందేలా సేవలు అందించాల్సి ఉందన్నారు. ఎక్కడా రేషన్ బియ్యం రీ సైక్లింగ్ జరగకుండా చూడాలన్నారు. రైస్ కార్డులో పేర్లు నమోదైనప్పటికీ, జీఎస్డబ్ల్యుఎస్ డేటాలో లేని 79,173 మంది వివరాలపై వెంటనే పరిశీలన చేసి సరిచేయాలన్నారు. మరోవైపు, రైస్ కార్డులకు సంబంధించి ఈనెల 15 నుంచి వాట్సప్ గవర్నెన్స్ మన మిత్ర కింద సేవలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
సంబంధిత కథనం
టాపిక్