అంతరిక్ష యాత్రకు శుభాన్షు శుక్లా.. నాలుగు దశబ్దాల తర్వాత మనోడు!

Best Web Hosting Provider In India 2024


అంతరిక్ష యాత్రకు శుభాన్షు శుక్లా.. నాలుగు దశబ్దాల తర్వాత మనోడు!

Anand Sai HT Telugu

భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా రోదసిలోకి బయలుదేరారు. నాసా కెన్నెడీ స్పెస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ దూసుకెళ్లింది. ఈ సందర్భంగా శుభాన్షు భారతీయులకు ఓ సందేశాన్ని కూడా ఇచ్చారు.

అంతరిక్ష యాత్రకు శుభాన్షు శుక్లా (@Axiom_Space)

అంతరిక్ష యాత్రకు బయలుదేరిన శుభాన్షు శుక్లా స్పేస్ క్రాఫ్ట్ ఎక్కిన తర్వాత భారతీయులకు ఓ సందేశాన్ని ఇచ్చారు. స్పేస్ క్రాఫ్ట్ లో 10 నిమిషాల ప్రయాణం అనంతరం శుభాన్షు ఓ సందేశంలో.. ‘నమస్కారం నా ప్రియమైన దేశప్రజలారా. 41 ఏళ్ల తర్వాత మనం అంతరిక్షంలో ఉన్నాం. ఇది మరపురాని ప్రయాణం. మనం సెకనుకు 7.5 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతున్నాం. నా భుజాలపై భారతదేశ త్రివర్ణ పతాకం ఉంది.’ అని శుభాన్షు చెప్పారు. నాలుగు దశబ్దాల కిందట 1984లో రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లారు. ఇప్పుడు శుభాన్షు శుక్లా రెండో భారతీయుడు.

శుభాన్షు శుక్లా మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి ‘ఆక్సియమ్-4’ మిషన్ కింద అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరి చరిత్ర సృష్టించారు. ఆక్సియమ్ స్పేస్ వాణిజ్య మిషన్‌లో భాగంగా బుధవారం ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ రాకెంట్ 12.01 గంటలకు విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్లింది. ఆ తర్వాత కొన్ని నిమిషాల తర్వాత రాకెట్ నుంచి వీరి క్యాప్సుల్ వీడిపోయి.. అంతరిక్ష కేంద్రం దిశంగా ప్రయాణం కొనసాగించింది.

మిషన్‌లో ఉంది వీళ్లే

పలు వాయిదాల అనంతరం బుధవారం మధ్యాహ్నం 12.01 గంటలకు ఆక్సియమ్-4 మిషన్‌ను నిర్ణీత సమయానికి టేకాఫ్ తీసుకున్నారు. లక్నోకు చెందిన శుభాన్షు శుక్లాతో పాటు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వ్యోమగామి మాజీ మిషన్ కమాండర్ పెగ్గీ విట్సన్, హంగేరియన్ వ్యోమగామి టిబోర్ కాపు, పోలాండ్‌కు చెందిన స్లావోజ్ ఉజ్నాన్స్కీ-విస్నీవ్స్కీ ఈ మిషన్‌లో భాగంగా ఉన్నారు.

అనేకసార్లు వాయిదా

ఆక్సియమ్ -4 మిషన్‌కు కమాండర్ పెగ్గీ విట్సన్ నేతృత్వం వహిస్తుండగా.. శుక్లా మిషన్ పైలట్‌గా, హంగేరియన్ వ్యోమగామి టిబోర్ కాపు, పోలాండ్కు చెందిన స్లావోజ్ ఉజ్నాన్స్కీ-విస్నీవ్స్కీ మిషన్ స్పెషలిస్టులుగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి మే 29న ప్రయోగాన్ని షెడ్యూల్ చేసినప్పటికీ ఫాల్కన్-9 రాకెట్ బూస్టర్ లిక్విడ్ ఆక్సిజన్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని పాత రష్యన్ మాడ్యూల్‌లో లీకేజీని గుర్తించడంతో జూన్ 8, జూన్ 10, జూన్ 11 తేదీలకు వాయిదా పడింది. ఇలా పలు దఫాలుగా వాయిదా పడి నేడు విజయవంతమైంది.

అనుసంధానం

28 గంటలు ప్రయాణించిన తర్వాత.. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంటారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు వ్యోమనౌక అనుసంధానం అవుతుంది. అక్కడ 14 రోజులపాటు ఉంటారు.

భారత్ 7 ప్రయోగాలు

ఆక్సియమ్ 4 మిషన్ కింద అంతరిక్ష కేంద్రంలో 60కి పైగా శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహిస్తారు. 60 ప్రయోగాలు ఉమ్మడి సహకారంతో జరుగుతాయి. ఇవి బయో సైన్స్, మానవ ఆరోగ్యం, అంతరిక్ష జీవిత వ్యవస్థ, అధునాతన సాంకేతికతపై ఆధారపడి ఉంటాయి. వీటిలో భారతదేశం నుండి 7 పరిశోధన ప్రాజెక్టులు, యూఎస్ నుండి 5 ఉన్నాయి. ఆక్సియమ్ 4 మిషన్‌లో శుభాన్షు శుక్లా భాగస్వామ్యం నుండి భారతదేశం ఎంతో ప్రయోజనం పొందుతుంది. ఈ మిషన్ సమయంలో భారతదేశ గగన్‌యాన్ వ్యోమగాముల శిక్షణ, మిషన్ రూపకల్పనలో శుభాన్షు శుక్లా అనుభవం చాలా ఉపయోగకరం.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link