





Best Web Hosting Provider In India 2024

స్కూల్ ముందు గోలీ సోడా దొరికే ప్లేస్లలోనే డ్రగ్స్ దొరకడం ఆందోళనకరం.. రైజింగ్ తెలంగాణకు మద్దతుగా నిలుద్దాం: రామ్ చరణ్
అంతర్జాతీయ డ్రగ్స్, అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈవెంట్లో రామ్ చరణ్ పాల్గొన్నాడు. ఒకప్పుడు స్కూల్ ముందు గోలీ సోడా దొరికే ప్లేస్ లలోనే ఇప్పుడు డ్రగ్స్ దొరకడం ఆందోళనకరమని అతడు అన్నాడు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా డ్రగ్స్ కు వ్యతిరేకంగా గళమెత్తాడు. అంతర్జాతీయ డ్రగ్స్, అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన రైజింగ్ తెలంగాణ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి అతడు పాల్గొన్నాడు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా అందరం రైజింగ్ తెలంగాణకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చాడు.
గోలీ సోడా దొరికే చోట డ్రగ్స్
డ్రగ్స్ కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం గురువారం (జూన్ 26) ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహించింది. దీనికి రామ్ చరణ్ ప్రత్యేక అతిథిగా వచ్చాడు. అతనితోపాటు సీఎం రేవంత్ రెడ్డి, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, విజయ్ దేవరకొండ, ప్రొడ్యూసర్ దిల్ రాజులాంటి వాళ్లు కూడా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో రామ్ చరణ్ మాట్లాడాడు.
“రైజింగ్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా ఇలాంటి అవగాహన కార్యక్రమం నిర్వహించినందుకు, దీనికి హాజరైనందుకు సీఎం రేవంత్ రెడ్డి, సోదరుడు విజయ్ దేవరకొండ, దిల్ రాజు, పుల్లెల గోపీచంద్ లకు కృతజ్ఞతలు. నా చిన్నతనంలో స్కూల్లో ఉన్నప్పుడు గోలీ సోడా, పాప్సికిల్స్ కొనుక్కొని తినేవాడిని. కానీ ఇప్పుడదే ప్లేస్ లలో డ్రగ్స్ దొరుకుతుండటం, తెలియక వాటిని చిన్నారులు వాడుతుండటం చూస్తుంటే ఆందోళనగా ఉంది. ఏదో తాత్కాలికంగా ఉండే ఆనందం కోసం ఇలాంటి ప్రమాదకర పదార్థాలు తీసుకోవడం సరికాదు” అని చరణ్ అన్నాడు.
కుటుంబాలతో గడపండి
ఈ సందర్భంగా నిజమైన ఆనందం ఎక్కడ ఉంటుందో కూడా చరణ్ చెప్పాడు. “నిజమైన ఆనందం కుటుంబంతో గడపడంలో ఉంటుంది. ఉదయాన్నే కసరత్తులు చేయడం, స్పోర్ట్స్ ఆడటం.. షూటింగ్ కు వెళ్లి రావడం, తర్వాత కుటుంబంతో విలువైన సమయం గడపడం, తర్వాత స్నానం చేసి పడుకొని మరుసటి రోజు కోసం సిద్ధం కావడం.. ఇంతకుమించిన ఆనందం ఏముంటుంది” అని చరణ్ అన్నాడు.
రైజింగ్ తెలంగాణ ఉద్యమానికి అందరం మద్దతుగా నిలివాలని రామ్ చరణ్ పిలుపునిచ్చాడు. “మనం కచ్చితంగా మన కుటుంబాలు, మన స్నేహితులు, మన స్కూళ్లను కాపాడుకోవాలి. అదే అసలైన విషయం. డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాటానికి ఓ రోజు ఉంటుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. కానీ ఆ రోజు కూడా వచ్చింది. రైజింగ్ తెలంగాణకు మనమందరం మద్దతుగా నిలుద్దాం. ఈ ఉద్యమంలో పాల్గొందాం” అని చరణ్ పిలుపునిచ్చాడు.
ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కాబోతోంది.
సంబంధిత కథనం