




Best Web Hosting Provider In India 2024

పాకిస్థాన్ నటీనటులను నిషేధించడంపై లక్ష్మీ మంచు షాకింగ్ కామెంట్స్.. కళను ఎందుకు రాజకీయం చేస్తారంటూ..
ఇండియాలో పాకిస్థాన్ నటీనటులపై నిషేధం విధించడంపై లక్ష్మీ మంచు స్పందించింది. కళను రాజకీయం చేయొద్దని, దీనివల్ల ఏం సాధిస్తామంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేయడం గమనార్హం. పాకిస్థాన్ నటీనటులతో పని చేయడంపై పలువురు బాలీవుడ్ తారలు ట్రోలింగ్ కు గురవుతున్న విషయం తెలిసిందే.
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త సంబంధాల నేపథ్యంలో, పాకిస్థానీ నటులపై భారత్లో నిషేధం విధించాలనే డిమాండ్లు మళ్ళీ తెరపైకి వచ్చాయి. ఈ మధ్యే, పాకిస్థానీ నటీనటులతో కలిసి పనిచేసినందుకు గాను వాణీ కపూర్, దిల్జిత్ దోసాంజ్ విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే, నటి లక్ష్మీ మంచు మాత్రం ఈ అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తోంది. కళను, రాజకీయాలను వేర్వేరుగా చూడాలని ఆమె స్పష్టం చేసింది.
మన మంచితనం ఏమైంది?
బాలీవుడ్లో ప్రస్తుతం దిల్జిత్ దోసాంజ్.. ‘సర్దార్ జీ 3’ సినిమాలో హానియా అమీర్తో కలిసి నటించినందుకు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో వాణీ కపూర్ కూడా ఫవాద్ ఖాన్ తో కలిసి నటించిన ‘అబీర్ గులాల్’ సినిమా పహల్గాం ఉగ్రదాడి తర్వాత రిలీజ్ ఆగిపోయింది. ఈ సందర్భంగా లక్ష్మీ మంచు ఈ అంశంపై స్పందించింది.
“కళను రాజకీయం చేయొద్దు. సమస్యలు సృష్టిస్తున్న వారిని వేటాడండి. అందరినీ ఒకేసారి నిషేధించి మీరు వాళ్లతో కలిసి పని చేయొద్దనడం సరికాదు. మనం ఎక్కడ ఎదుగుతున్నాం? మన మంచితనం ఏమైంది? భారతీయులుగా మనం ఈ కళాకారులందరినీ మనస్ఫూర్తిగా స్వాగతించాం” అని లక్ష్మీ మంచు అభిప్రాయపడింది.
వీటితో ఏం సాధిస్తాం?
ఈ అంశంపై లక్ష్మీ మరిన్ని కామెంట్స్ కూడా చేసింది. “ఇప్పుడు మన మనసులు ఏమయ్యాయి? రాజకీయం దారి వేరు. కానీ, ఇలాంటి నిషేధాలతో ఏం సాధిస్తాం? ఒక నటుడి వెంట ఎందుకు పడతారు? వారితో భారత్కు ఎలాంటి ముప్పు? వారి ఇన్స్టాగ్రామ్ను నిషేధించడం ఏమిటి? ఎంత అభద్రతాభావంతో ఉన్నారో ఇది చూపిస్తోంది. విభజించి పాలించే విధానం కాకుండా, మనం ఒక ఉమ్మడి లక్ష్యాన్ని కనుగొని, ఉమ్మడి శత్రువుపై కలిసి పోరాడే మార్గాలను వెతకాలి” అని లక్ష్మీ చెప్పింది.
లక్ష్మీ మంచు తాజాగా ‘ది ట్రెయిటర్స్’ సిరీస్లో కనిపించిన విషయం తెలిసిందే. ఇదొక రియాల్టీ షో. ఇక ఇలాంటివి జరిగినప్పుడు తనకు ఎలా అనిపిస్తుందో కూడా ఈ సందర్భంగా ఆమె వెల్లడించింది. “కళాకారుల విషయంలో నాకు చాలా బాధ అనిపిస్తుంది. మేం సినిమాలు తీస్తాం. మేం వినోదాన్ని అందిస్తాం. సమాజంలో ఏం జరుగుతుందో అద్దంలా చూపించాల్సిన బాధ్యత మాపై ఉంది. ఫిక్షన్ స్వేచ్ఛ మాకు ఉంది. కానీ, ‘మీరు చేయకూడదు’ అని ఎవరైనా అంటే, దాన్ని జీర్ణించుకోవడం నాకు చాలా కష్టం” అని ఆమె స్పష్టం చేసింది.
ద్వేషంతో నిండిపోయారు
ప్రస్తుతం దేశ ప్రజలు ద్వేషంతో నిండిపోయి, ఎవరో ఒకరిని నిందించడం కోసం చూస్తున్నారని ఆమె అభిప్రాయపడింది. “అది మీకు శాంతిని ఇస్తే, మీరు ఆ మార్గాన్ని ఎంచుకోవచ్చు. కానీ బాగా గాయపడిన మనిషే అలా మాట్లాడుతాడు. మనం ఎంత కాలం పోరాడుతూ ఉంటాం? మనమంతా కలిసే ఉన్నాం. మనమంతా ఒక్కటే. మనం ఒకరి పట్ల ఒకరం మరింత మానవత్వాన్ని, ప్రేమను చాటాలి” అని లక్ష్మీ చెప్పింది.
సంబంధిత కథనం