




Best Web Hosting Provider In India 2024

కాలేజీల్లో డ్రగ్స్ పట్టుబడితే యాజమాన్యాలపై కేసులు – సీఎం రేవంత్ రెడ్డి
ఎవరైనా మాదకద్రవ్యాలతో రాష్ట్రంలోకి రావాలంటే భయపడాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాలేజీలు, పాఠశాలల ప్రాంగణాల్లో డ్రగ్స్ పట్టుబడితే యాజమాన్యాల మీద కూడా కేసులు పెట్టాలని అధికారులను ఆదేశించారు.
సీఎం రేవంత్ రెడ్డి
ఒకనాటి ఉద్యమాల గడ్డ తెలంగాణ మాదక ద్రవ్యాల మహమ్మారికి అడ్డాగా మారకూడదన్న లక్ష్యంతో ‘ఈగల్'(Eagle)ను ఏర్పాటు చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రపంచంతో పోటీ పడే ఒక ఆరోగ్యకరమైన, మాదక ద్రవ్య రహిత తెలంగాణను నిర్మించుకోవడంలో ప్రభుత్వ సంకల్పానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినం పురస్కరించుకుని తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో డ్రగ్స్ నియంత్రణపై కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ – ముఖ్యమైన అంశాలు
- “తెలంగాణలో ఒకనాడు ఉద్యమాలకు వేదికలైన కాలేజీలు, యూనివర్సిటీలు గంజాయి, మాదక ద్రవ్యాలకు వేదిక అయితే అది అందరికీ అవమానం. యువకులు డ్రగ్స్ బారిన పడి బలవుతున్నారు. డ్రగ్స్ నియంత్రించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. పాఠశాల, కాలేజీల్లో ఎక్కడైనా సరే దీనికి సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే తెలియజేయండి.
- తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో విద్యార్థులను స్కూళ్లు, కాలేజీల్లో చేర్పిస్తుంటే, కేవలం చదువు చెబితే చాలన్నట్టు యాజమాన్యాలు, అధ్యాపకులు భావించడం సరికాదు. వాటిని నియంత్రించడంలో యాజమాన్యాలకు కూడా బాధ్యత ఉంటుంది.
- కాలేజీల్లో డ్రగ్స్ ఆనవాళ్లు దొరికితే ఇక నుంచి వాటి యాజమాన్యాలపైన కూడా కేసులు నమోదు చేయండి. యాజమాన్యాలు, అధ్యాపకులు విద్యార్థినీ విద్యార్థుల నడవడికను కూడా గమనించాల్సి ఉంటుంది. డ్రగ్స్ నియంత్రణపై పాఠశాలలు, కాలేజీల యాజమాన్యాలతో నార్కోటిక్స్ బ్యూరో ఒక సమావేశం నిర్వహించాలి.
- 140 కోట్ల జనాభా ఉన్న భారత దేశంలో 68 శాతం యువత ఉంది. ఐటీతో సహా అన్ని రంగాల్లో దేశం ముందుకు వెళుతుంటే దెబ్బతీయడానికి, దేశాన్ని నిర్వీర్యం చేయడానికి ఇలాంటి డ్రగ్స్ మహమ్మారితో యువతను బలిగొనే కుట్రలు జరుగుతున్నాయి.
- దేశ రక్షణలో ముందు వరుసలో నిలుచున్న పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో డ్రగ్స్ భారిన పడి యువత నిర్వీర్యమైపోతోంది.
- డ్రగ్స్తో ఎవరైనా తెలంగాణలో కాలు పెట్టాలంటే వందసార్లు ఆలోచించాలి. ఒక గడ్డి పరకైనా రాష్ట్రంలో అడుగుపెట్టినా వెన్ను విరుస్తాం. ఐటీ హబ్గా, ఫార్మా హబ్గా ఉన్న తెలంగాణ గంజాయి, డ్రగ్స్ హబ్గా మారితే మనమంతా విఫలమైనట్టే. యువతను సరైన దిశగా నడిపించాల్సిన అవసరం ఉంది.
- యువతను సరైన దిశలో నడిపించాలన్న ఉద్దేశంతోనే క్రీడా పాలసీని తెచ్చాం. నైపుణ్యాలను మెరుగుపరచడానికి స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. రేపటి రోజున ఎవరైనా క్రీడల్లో శిక్షణ తీసుకోవాలంటే తెలంగాణ వెళ్లాలన్న పరిస్థితి రావాలి. తెలంగాణను ఒక స్పోర్ట్స్ హబ్గా మార్చడానికి దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లోని యూనివర్సిటీలతో ఒప్పందాలు చేసుకున్నాం.
- ప్రపంచంతో పోటీ పడే శక్తి, యుక్తి దేశంలో ఉంది. తెలంగాణలోని 1కోటి 50 లక్షల ఎకరాల్లో ఒక్క గంజాయి మొక్క మొలవొద్దు. ఒక్క గంజాయి మొక్క మొలిచినా ఈ Eagle (గద్ద) ఇట్టే పట్టేస్తుంది ” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
టాపిక్
Cm Revanth ReddyDrugsTelangana News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.